Monday, November 2, 2015

ఇవ్వాళ్టి ప్రభాతసమయంలో
నా వలను సంద్రంపైకి విసిరాను.
వలను మల్లీ నాదగ్గరకు లాక్కునేసరికి
ఎన్నో సౌందర్య విలసితమైన వస్తువులు
దానిలోకి జారిపడి కన్నులెదుట కనిపించాయి.

కొన్ని దరహాస చంద్రికల్లా దర్శనమిస్తే
కొన్ని ఆనంద భాష్పాల్లా తళుక్కుమన్నాయి.
మరికొన్ని నవవధువు లేతబుగ్గలమీద
మెరిసే నక్షత్రాల్లా సాక్షాత్కరించాయి.


విరామమెరుగని దినచర్యానంతరం
ఎగురుకుంటూనే ఇంటికి తిరిగి చేరుకున్నాను.

ఆవిడేమో పూలనంటిపెట్టుకుని
వచ్చిన ఆకులనేరుతూ తోటలో కూర్చుంది.
సంశయిస్తూనే కొద్ది క్షణాలతర్వాత
ఆమెదగ్గరకు ఆనందంగా అడుగులేసుకుంటూ వెళ్ళాను.
వలనంతా ఆవిడ సమ్ముఖంలో పెట్టి
నిశ్శబ్దంగా నిలుచున్నాను.

ఆవిడ ఆ వలలోని వాటివైపు తీక్షణంగా చూసి
ఒక పిచ్చినవ్వును నావైపు విసిరేసి
ఈ పిచ్చి వస్తువులన్నీ ఏమిటి? వీటిని
ఉపయోగించడమెలాగో నాకు తెలీడంలేదు.
సిగ్గుతో నేను శిరసు వంచుకుని నిలుచున్నాను.
నేనువీటికోసమేమీ యుద్దo   చేయలేదుకదా!!
లేదా,  వాటిని విపణివీధిలో విక్రయించగా కొనలేదు.
ఇవి  ఆవిడకు కానుకలుగాకూడా తీసుకురాలేదు.

చీకటిపడ్దాక నేను తెచ్చిన వాటినన్నింటినీ
ఒక్కొక్కటిగా వీధిలోకి గిరవాటు వేసేశాను,
మరునాడు వుదయం బజారులో నడుస్తున్న
వాళ్ళు వాటినన్నిటినీ అపురూపంగా భావించి ఏరుకుని
గుండెలకు దగ్గరగా హత్తుకుని దూర దూర దేశాలకు
ఎగుమతి చేసి ధనికులై విలసిల్లారు,

మరింకా కోట్లకు  పడగలెత్తారు..

[టాగూరు తోటమాలిలోని 2 వ గీతానికి స్వేచ్ఛానువాదం]

No comments:

Post a Comment